ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్లో ఘటనలే కలకలం సృష్టిస్తున్న జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ప్రేరణ కలిగించాయా? అవుననే చెబుతున్నారు అందులో ప్రధాన నిందితులు. పోలీస్ విచారణలో ఈ విషయం వారు వెల్లడించినట్లు తెలిసింది. పైగా, మైనర్ నిందితుల్లో నేరం చేశామనే ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కరడుగట్టిన నేరస్థులు కూడా.. పోలీసు కస్టడీ, సీన్ రీ-కన్స్ట్రక్షన్, ఉన్నతాధికారులు విచారణకు జంకుతారని, కానీ ఈ కేసులో మైనర్లు మాత్రం వీవీఐపీల పిల్లలు కావడంతో, తమకున్న పలుకుబడి కారణంగా తమను ఎవ్వరు ఏమీ చేయలేరన్న ధీమా కావచ్చు వారంతా తాపీగా ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి కలవరం, తప్పుచేశామనే బాధ లేకుండా, తమలోతాము పరస్పరం నిందలు వేసుకుంటున్నారని సమాచారం.
పోలీసు కస్టడీలో విచారణ సందర్భంగా.. ‘‘దొరికిపోతామనుకోలేదు’’ అని చెబుతూ.. కార్పొరేటర్ కుమారుడు, సాదుద్దీన్లదే తప్పని చెబుతూ.. పరస్పరం ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు మైనర్ నిందితులకు పబ్లోనే పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.
అత్యాచార ఉదంతంపై మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించేందుకు పోలీసులు న్యాయస్థానం ఆదేశంతో మైనర్లను విచారిస్తున్నారు. నిందితులో ఒకరు నోరు విప్పకపోగా, మరో ఇద్దరు మాత్రం వివరాలు వెల్లడిస్తున్నట్టు సమాచారం. మైనర్లవ్వడంతో పబ్బుల్లో వారికి ప్రవేశం ఉండదు. అందుకే మేజర్లయిన స్నేహితులు పార్టీలు ఏర్పాటుచేస్తే వాటిలో పాల్గని తామే బిల్లు చెల్లిస్తామని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది.
పరీక్షలు పూర్తయినప్పట్నుంచి తామంతా ఖాళీగా ఉన్నామని, దాదాపు ప్రతిరోజూ పబ్బులకు వెళుతున్నామని, పార్టీల్లో కలుసుకుంటున్నామని వారు తెలిపారు. మే 28 న అమ్నీషియా పబ్కు వెళ్లామని, బాధిత బాలిక, మరో బాలికను పరిచయం చేసుకున్నామని, డేటింగ్కు వెళదామని అడగాలని అనుకున్నామని పేర్కొన్నారు.
బాలికలు నవ్వుతూ మాట్లాడుతుండటం, పరిచయం చేసుకునే సమయంలో అమాయకంగా కనిపించడంతో ఇద్దర్నీ బయటకు తీసుకెళ్లి ఏదైనా చేద్దామనుకున్నామని నిందితులు పోలీసులతో చెప్పారు. ఈ క్రమంలోనే వారి ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు అసభ్యంగా ప్రవర్తించామని తెలిపారు.
వాళ్లు బయటకు రావడంతో తామూ వచ్చేశామని చెబుతూ వారిలో ఓ బాలికను నమ్మించామని, అత్యాచారం చేయాలనుకున్నామని తెలిపారు. అందరూ అనుకునే ఇదంతా చేశామని, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్లో ఘటనలే తమకు ప్రేరణ అని నిందితులు పోలీసులకు తెలిపినట్లు తెలుస్తుంది.