తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాగలవని ప్రచారం జరుగుతూ ఉండడంతో వచ్చే ఎన్నికలలో పోటీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సిద్దపడుతున్నారు. తన పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఒక వంక కసరత్తు చేస్తూ, తాను స్వయంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యంగా ఉన్న పాలేరు నుండి షర్మిల పోటీపడనున్నట్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్బాబు, నియోజకవర్గ ఇన్చార్జి బీరవెల్లి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో ఈ నెల 19 న నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని సుధీర్ బాబు తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్కే పట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండటం, ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండటం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్కు పాలేరు కంచుకోటగా ఉండటం దృష్ట్యా షర్మిల ఈ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.
రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్కు అక్కడ బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయని, మరోవైపు టిఆర్ఎస్లోని వర్గ విభేదాలు కూడా లాభిస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
తనకో అవకాశం ఇవ్వాలని షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో నిర్వహించిన నిరుద్యోగ నిరహార దీక్షలో మాట్లాడుతూ … కెసిఆర్ ఓ హంతకుడని, నిరుద్యోగుల చావులకు ఆయనే కారణమని ఆరోపించారు.
ఉద్యోగ ఖాళీలున్నా భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగుపడతాయని ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ఉద్యమం చేసి రాష్ట్ర సాధనకు కృషి చేశారని పేర్కొన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ఖజానాను టిఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు.
మరోసారి కెసిఆర్ను ఎన్నుకుంటే చీకట్లో మగ్గినట్లేనని ఆమె హెచ్చరించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయటం చేతకాని సీఎం కేసీఆర్ రాజీనామా చేసి, దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.