తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని కొనియాడారు.
వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోందని సద్గరు జగ్గీ వాసదేవ్ హెచ్చరించారు. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని స్పష్టం చేస్తూ వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనం అయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు.
చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమే అని తెలిపారు.