ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావిస్తూ అందులో చూపిన కాశ్మీర్ పండిట్లపై దాడులను ఆమె గోరక్షకుల దాడులతో పోల్చుతూ మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. దానితో ఆమెపై భజరంగ్దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఈ విషయమై సీనియర్ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని అంటూ సున్నితంగా ఆమెను మందలించారు.
ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్బజార్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.
సాయిపల్లవి ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ… ‘‘కొన్ని రోజుల ముందు ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్ను ఎట్లా చంపారనేది చూపించారు కద” అంటూ ఆమె ప్రస్తావించారు.
అయితే, కాశ్మీర్ పండిట్లపై దాడులను కరోనా సమయంలో జరిగిన సంఘటనలతో ఆమె పోల్చే ప్రయత్నం చేశారు. “కరోనా సమయంలో ఎవరో ‘ఓ మతపర ఘర్షణ’ లాగా తీసుకుంటే ఇటీవల ఎవరో ఒక బండిలో ఆవును తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా” అంటూ ఆమె పేర్కొన్నారు.
అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అని ఆమె ప్రశ్నించారు. కాబట్టి, ఇప్పుడు మనం మతం పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం’’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రవేశాలకు దారితీసాయి.
సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూవాదులు మండిపడ్డారు. పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోవులను కాపాడిన రక్షకులను ఎలా పోల్చుతారని ప్రశించారు. ఈ క్రమంలో సాయి పల్లవిపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి స్పందించారు.
‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని…. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం… ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది’ అంటూ ఆమెకు విజయశాంతి హితవు చెప్పారు.
డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం…. తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? అంటూ నిలదీశారు. ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ…. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలని హితవు చెప్పారు.
ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోందని విజయశాంతి పేర్కొన్నారు.
అయితే తన వాఖ్యలపై చెలరేగిన వివాదంపై వెంటనే స్పందించడానికి ఆమె తిరస్కరించారు. గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను.. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు” అంటూ ఆమె పేర్కొన్నారు.
“ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదంపై మాట్లాడతాను..’’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
ఇదే వేడుకలో ఈ వివాదంపై రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘నేను లేని సమయంలో సాయిపల్లవిని మాట్లాడించారు. నేను ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. అయినా ఇంత పెద్ద ప్రెస్ మీట్లో వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం అయితే ఇది కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడి ‘విరాట పర్వం’ చిత్రం చేశాము. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను..’’ అంటూ ఆ వివాదాన్ని దాటవేశారు.