అగ్నిపథ్ పై యువకుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లకు నిరసనకారులు నిప్పటించారు. అలాగే 20 బైక్ లను కూడా తగులబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు యువకులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు.
గూడ్స్ రైలులో ఉన్న సామాన్లను పట్టాలపై పడేశారు. ఫ్లాట్ఫామ్పైన ఉన్న షాపులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్ విడిచి వెళ్తుతున్న దృశ్యాలు కనిపించాయి.
కాగా, బీహార్లోని లఖ్మినియా రైల్వే స్టేషన్కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్లను ధ్వంసం చేసి రైళ్లను నిలిపివేశారు. నాలుగేళ్ల ఉద్యోగం పేరుతో అగ్నిపథ్ స్కీమ్ను రక్షణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
భగల్పూర్, న్యూఢిల్లీ మధ్య నడిచే విక్రమ్శిలా ఎక్స్ప్రెస్, జమ్మూతావి-గౌహతి ఎక్స్ప్రెస్ రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని 72 గంటల డెడ్లైన్ జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ అధికారులు వెంటనే కాజీపేటకు వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రైల్వే స్థేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ లో అగ్నిపథ్ వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళనతో ఏపీలోని అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు.
రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.