అధిక ద్రవ్యోల్బణానికి తోడు వినిమయం పడిపోవడంతో అమెరికా ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అహార, ఇంధన వినియోగదారుల ధరల సూచీ తమ అంచనాల కంటే ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు.
అమెరికాలో గడచిన మేలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ 8.6 శాతానికి ఎగిసింది. 1981 తర్వాత అంటే గడిచిన 40 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక ధరల పోటు. ఆర్థిక నిపుణులతో సిఎన్బిసి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అమెరికా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ మైకెల్ హర్ట్నెట్ మాట్లాడుతూ.. ” సాంకేతికంగా సంక్షోభంలోనే ఉన్నాం. కానీ.. దీన్ని మనం నమ్మడం లేదు” అని పేర్కొన్నారు.
బ్లెక్లే అడ్బైజర్ గ్రూపు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పీటర్ బక్వర్ మాట్లాడుతూ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంక్షోభం ప్రారంభం కానుందని.. ఇందులో అశ్యర్యపోవాల్సిందేమీ లేదని తెలిపారు. సంక్షోభ ప్రారంభానికి మధ్యలో ఉన్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఏడాది దేశ జిడిపి వృద్ధి అంచనాను 2.8 శాతం నుంచి 1.7 శాతానికి కోత పెడుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటన దీనినే బలపరుస్తున్నది.
ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు మందగించాయనడానికి ఇదొక సంకేతం. 2022 సంవత్సరానికి రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను 4.3 శాతం నుంచి 5.2 శాతానికి పెంచింది. ఈ పరిణామాలు ఆ దేశ ఆర్థిక సంక్షోభానికి స్పష్టమైన సంకేతాలు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవంక, అమెరికాలో ధరలు 40 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసిపడటంతో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ రక్షణ చర్యలు ప్రారంభించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రామాణిక రుణ రేట్లను 0.75 శాతం పెంచింది. దీంతో రుణ రేట్ల శ్రేణి కరోనా ముందు నాటి స్థాయి 1.5-1.75 శాతానికి చేరింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం విశేషం. వచ్చే ఏడాది చివరి నాటికి ఫెడ్ రేట్లు 3.8 శాతానికి చేరుకోవచ్చని అంచనా.
సంక్షోభ భయాలతో గురువారం అమెరికన్ మార్కెట్లు ప్రారంభంలోనే కుప్పకూలాయి. అమ్మకాల ఒత్తిడితో డోజోన్స్ 700 పాయింట్లు కోల్పోయింది. ఎస్అండ్పిలో 11 ప్రధాన రంగాలు కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఎనర్జీ, కన్సూమర్ సూచీలు 4.2 శాతం, 3.6 శాతం చొప్పున నష్టంలో ట్రేడింగ్ అయ్యాయి. నాస్డాక్ 355 పాయింట్లు లేదా 3.21 శాతం క్షీణించి 10,743 వద్ద కదలాడింది. అమెరికాలోని అతిపెద్ద విత్త సంస్థ మార్గన్ స్టాన్లే 4 శాతం నష్టపోయింది.