అగ్నిపథ్ లో పథకం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ ఇందులో చేరడం అదనపు అర్హత మాత్రమే అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి శుక్రవారం అక్కడ నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.
కుట్రపూరితంగానే అగ్నిపథ్ పై ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా విధానం మెక్సికో, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో అమల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. భారత్ లో కూడా ఇది తప్పనిసరి కాదని చెబుతూ దేశ భక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నం ఈ పథకం ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్లే చేరవచ్చని వెల్లడించారు.
ఆందోళనల ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. ప్రయాణికులను భయపెట్టినా పట్టించుకోలేదని విస్మయం వ్యక్తం చేసారు.
అంతకు ముందు రాజ్ భవన్ ముట్టడి సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రధాన గేట్ వద్దకు వచ్చారని గుర్తు చేశారు. వీటన్నింటి వెనుక కుట్ర ఉందని పేర్కొంటూ నిజానికి శాంతిభద్రతల బాధ్యత రాష్ట్రానిదే అని హితవు చెప్పారు. ఈ ఘటనలన్నీ ప్రణాళిక ప్రకారం జరిగాయని ఆరోపించారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ శాంతిభద్రతల బాధ్యతలు చూడదని ఆయన స్పష్టం చేశారు. ఇందతా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలని తేల్చి చెప్పారు. రైల్వే కోచ్ లు తగలబెట్టినా ఎందుకు ఆపలేకపోయారు..? ఆందోళన జరుగతుందని తెలిసి పోలీసులు రాలేదు..? అని ప్రశ్నించారు.
వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. యువతకు అన్యాయం చేయలేదనేది పేర్కొంటూ ఆ విధంగా చేయడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారు తమ దృష్టికి సమస్యలు తీసుకువస్తే మాట్లాడుతామని చెప్పారు.