సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని రైల్వే డిఎం గుప్తా పేర్కొన్నారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమైందని డిఎం వెల్లడించారు. పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్నారు. పూర్తిస్థాయి నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని గుప్తా చెప్పారు. పవర్ కార్(డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని డిఎం స్పష్టం చేశారు. పవర్ కారుకు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్ ను పునరుద్ధరణ చేశామన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
52 మంది అరెస్ట్
ఇలా ఉండగా, సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 52 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆందోళనలు ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నారు. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. పారిపోయిన అభ్యర్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్, రైల్వే పోలీస్ ల జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.
మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, గుంటూరు, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులుగా ఉన్నట్టు పోలీసులు తేల్చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో పూర్తిగా భద్రతా బలగాలు మోహరించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వరంగల్, ఖాజీ పేట రైల్వే స్టేషన్లకు మూడంచెల భద్రతా ఏర్పాటు చేసినట్టు సమాచారం.
15 వందల నుంచి 2 వేల మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై 143, 147, 307, 435, 427, 448, 336, 332, 341, 149, 150, 151, 152, 3POPPA సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.