అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొని విధ్వంసక చర్యలలో పాల్గొంటున్న యువత భవిష్యత్ లో సైన్యంలోనే కాకుండా సాయుధ దళాలు వీటిలో కూడా చేరలేరని స్పష్టం అవుతున్నది. విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తీవ్రమైన రైల్వే యాక్ట్లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.
అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ, ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనూ ఆ కేసులను ఉపసంహరించారు. దీన్నే విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా పిలుస్తారు. అయితే రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల్లో ఈ వెసులుబాటు ఉండదు. వీటి విచారణ సైతం ప్రత్యేక రైల్వే కోర్టులో జరుగుతుంది. ఈ కారణంగానే ఇదివరకు రైల్రోకో చేసిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టులో కేసు వీగినా ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క మల్టీ నేషనల్ కంపెనీల సహా అనేక ప్రైవేట్ సంస్థలు సైతం ఇటీవల ఉద్యోగం ఇచ్చే ముందు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా అడుగుతున్నాయి.
ఈ కేసు నేపథ్యంలో నిందితులుగా ఉన్న ఆందోళనకారులకు పోలీసు విభాగం క్లియరెన్స్ సర్టిఫకెట్లు జారీ చేయదని, పాస్పోర్టులు జారీ కావని, కొన్ని దేశాలకు ప్రత్యేక వీసాలు కూడా పొందడం కష్టసాధ్యమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాంటి సందర్భంలోనూ ఈ కేసు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.