సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.
దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు.
అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు.
భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు.
పధకం నచ్చకపోతే చేరకండి
కాగా, సాయుధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కొత్త విధానం అగ్నిపథ్ పథకం నచ్చకపోతే యువకులు దానిని ఎంచుకోవద్దని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ నిరసనకారులపై విరుచుకు పడ్డారు. కొత్త విధానం అగ్నిపథ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని సింగ్ కోరారు.
భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, ఔత్సాహికులు తమ ఇష్టానుసారం చేరవచ్చని స్పష్టం చేశారు. ‘‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేయవద్దు.మిమ్మల్ని ఎవరు చేరమని అడుగుతున్నారు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మీరు బస్సులు, రైళ్లను తగలబెడుతున్నారు. మిమ్మల్ని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారు’’ అని వీకే సింగ్ చెప్పారు. 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ‘అగ్నిపథ్’ పథకం ఆలోచన ఏర్పడిందని సింగ్ వివరించారు.