తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్త పుత్రుడను’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాఖ్యాలను తిప్పికొడుతూ తాను ప్రజలకు దత్తపుత్రిడిని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం ఖచ్చితంగా `సిబిఐకి దత్తపుత్రుడు’ అని తేల్చి చెప్పారు. భవిష్యత్లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదని జోస్యం చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
బాపట్ల జిల్లా పర్చూరులో పవన్ పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించారు. పర్చూరు బహిరంగ సభలో బాధితులకు ప్రకాశం జిల్లాకు చెందిన 80 రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతులను గుర్తించడం లేదని, కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు తప్ప అందరికీ ఈ విషయం తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోవడమే వైసీపీ లక్షణమని తప్పుబట్టారు.
ఉత్తర ప్రగల్భాలు పలకడమే వైసీపీ నైజంగా మారిందని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ‘‘వైసీపీ నేతలు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, దాడి చేయొచ్చు కానీ.. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా?” అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారని పేర్కొంటూ వైసీపీ నేతలు అధికారమదంతో కొట్టుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఎందుకు జరుగుతాయో తెలుసా? అని నిలదీశారు.
వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడని అంటున్నారని జనసేన అధినేత ధ్వజమెత్తారు. అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెబుతూ వైసీపీ నేతలకు సంస్కారం లేదని పవన్ మండిపడ్డారు. చనిపోయిన ప్రతి రైతుకు బీమా పథకం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
రైతులకు రూ.2 వేల కోట్లు ఇచ్చామంటున్నారని అంటూ ఎవరికి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అడిగేవారు ఎవరూ లేరనుకుంటున్నారు… కానీ ప్రశ్నిచేందుకు జనసేన) ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.