అక్రమాలకు పాల్పడిన మిల్లులపై చర్యలు తీసుకోవడంతో కేసీఆర్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్న దృష్ట్యా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యం సేకరణను నిలిపి వేసింది. దానితో తెలంగాణాలో బియ్యం మిల్లులు మూతపడుతున్నాయి. పలు తనిఖీలలో బియ్యం నిల్వలు లెక్కలకు సరిపోకపోవడంతో ఎఫ్సీఐ తీవ్రంగా పరిగణించింది.
సన్నధాన్యానికి సంబంధించి ఇబ్బంది లేకపోగా, దొడ్డు ధాన్యం మిల్లింగ్ చేసేచోట సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94లక్షట మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఎఫ్సీఐ బియ్యం సేకరణను ఈ నెల 7 నుంచి నిలిపివేయడంతో 20 రోజులుగా కస్టమ్ మిల్లింగ్ నిలిచిపోయింది.
బియ్యం సేకరణకు ఎఫ్సీఐ అనుమతించకపోవడంతో మిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోయి మిల్లర్లు, కార్మికులు, మిల్లులపై ఆధారపడిన తౌడు, నూక వ్యాపారులు, సాల్వెంట్ ఆయిల్మిల్ పరిశ్రమ కూడా కుదేలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3200 రైసు మిల్లింగ్ నిలిచిపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైసు మిల్లుల యజమానులతో పాటు కూలీలు, లారీ డ్రైవర్లు, గుమస్తాలు, హమాలీల జీవనోపాధి కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
మరోవైపు కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం రైసు మిల్లుల్లో నిల్వ చేశారు. మిల్లింగ్ ప్రక్రియ అవుతుందనుకుని బహిరంగ ప్రదేశాల్లోనే ధాన్యం బస్తాలను మిల్లర్లు నిల్వ చేశారు. ప్రస్తుతం ఎఫ్సీఐ అభ్యంతరాల కారణంగా మిల్లింగ్ నిలిచిపోవడంతో ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తోంది. వర్షాలకు ధాన్యం మొలకొస్తోంది. కస్టమ్ మిల్లింగ్ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఎఫ్సీఐకి అప్పగించే బాధ్యత మిల్లర్లదే.
ఈ క్రమంలో ఎక్కడ ధాన్యం నాణ్యత దెబ్బతిన్నా ఆ నష్టాన్ని మిల్లర్లే భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక్కో మిల్లుల్లో కోట్లాది రూపాయల ధాన్యం నిల్వ ఉన్నందున నష్టం కోట్లలోనే ఉంటుందని రైసు మిల్లర్లు వాపోతున్నారు. మిల్లింగ్ నిలిచిపోవడంతో బీహార్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలకు లక్షలు అడ్వాన్స్ లు చెల్లించి తీసుకువచ్చిన కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటుండడంతో మిల్లు యజమానులకు ఏం చేయాలో తోచడం లేదు.
మరోవైపు మిల్లులపై కరెంటు బిల్లుల భారం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది. మిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో కరెంటు కాల్చినా కాల్చకపోయినా చిన్న మిల్లు అయితే రూ.1 లక్ష, పెద్ద మిల్లు అయితే రూ.4 లక్షలను కనిష్టంగా కరెంటు బిల్లు కింద ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది.