సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏక్నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్ను ఆదేశించింది. జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతపై డిప్యూటీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉద్దవ్ ఠాక్రే లాయర్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను నిర్ణయం తీసుకోనివ్వండి అని కోర్టును కోరారు. అనర్హతపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తోన్న ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో షిండే రాజకీయ గందరగోళం సృష్టించి.. ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఏడుగురు పౌరులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు తమ ప్రమాణాలను ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్నాథ్ షిండే వర్గం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో షిండే ఈ అంశాన్ని పేర్కొన్నారు. దీంతో థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మైనార్టీలో పడినట్లయింది.
ఇలా ఉండగా, 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తొలగించారు. వారిలో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది.