చినజీయర్ ఆధ్వర్యంలోని సమతామూర్తి ఆశ్రమానికి సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఆశ్రమంలో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీని ముద్రించలేదంటూ ఓ వ్యక్తి తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేశారు.
ప్యాకెట్పై పేర్కొన్న బరువుకు, లోపలి ప్రసాదం బరువుకు మధ్య తేడా ఉందంటూ వినయ్ వంగాల ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆశ్రమంలో తనిఖీలు చేపట్టి మెట్రాలజీ చట్టం 2009లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చట్టంలోని సెక్షన్లు 10,11,12తో పాటూ 8/25 నిబంధన కింద కేసు నమోదైనట్టు వినయ్ వంగాల తెలిపారు. అయితే అధికార యంత్రాంగం ఈ ఫిర్యాదుపై వేగంగా స్పందించి కేసు దాఖలు చేయడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, చినజీయర్కు మధ్య విబేధాలున్నట్టు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ హాజరైన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరవడం..ఈ వార్తలకు బలం చేకూర్చినట్టైంది.
అయితే.. తనకు ఎవరితోనూ విబేధాలు లేవని చినజీయర్ స్వామీ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆశ్రమ నిర్వాహకులపై ప్రసాదం విషయంలో కేసు దాఖలవడం ప్రజల్లో మరోసారి చర్చకు తావిచ్చింది.