తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. అడ్లూరి లక్షణ్ పిటిషన్ను విచారణ చేపట్టేందుకు కోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది.
కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ విజేతగా నిలిచారు. అయితే, ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు ప్రకటించారని అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకెక్కారు.
ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని, ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కొప్పుల ఈశ్వర్త న ఎన్నిక చెల్లదని చెప్పేందుకు అడ్లూరి లక్ష్మణ్ తగిన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు.
అయితే, కోర్టు ఈ వాదనలు పట్టించుకోలేదు. కొప్పుల ఈశ్వర్ కౌంటర్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. త్వరలోనే అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.