మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులపైనా వస్తు సేవల పన్ను (జిఎస్టి) విధించనున్నారు. ఈ మేరకు జిఎస్టి మండలి ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జిఎస్టి మండలి సమావేశమైంది.
అదేవిధంగా చెక్ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా పన్ను వసూలు చేస్తారు. అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఇ-వే బిల్లు జారీ చేసేందుకు జిఎస్టి మండలి అనుమతినిచ్చింది. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది.
జిఎస్టి నమోదిత వ్యాపారాలకు నిబంధనలు, అధిక పన్ను చెల్లింపుదార్ల ఎగవేతల తనిఖీకి సంబంధించి మంత్రుల బఅందం (బిఒఎం) నివేదికకు మండలి ఆమోద్రముద్ర వేసింది. రోజుకు ఆసుపత్రి గది అద్దె రూ.5000 (ఐసియు మినహాయింపు) పైబడితే.. రోగుల నుంచి వసూలు చేసే దానిపై 5 శాతం జిఎస్టి విధిస్తారు.
10 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్న పోస్ట్కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, బుక్ పోస్ట్, ఎన్వెలప్లను మినహాయించి ఇతర తపాలా సేవలపై పన్ను వేయనున్నారు. చెక్లు, లూజ్ లేదా ఇన్ బుక్ ఫామ్పై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి రావొచ్చు. హోటల్లో గది అద్దె రోజుకు రూ.1000 లోపు ఉంటే జిఎస్టి మినహాయింపు ఉంది. ఈ స్థానంలో 12 శాతం పన్ను విధించాలన్న మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.
పన్నుల హేతుబద్ధీకరణపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మ్కె నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం మధ్యంతర నివేదికను మండలి అంగీకరించింది. అయితే ఈ నెల 30 తర్వాత కూడా జిఎస్టి పరిహారాన్ని కొనసాగించాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలు పాలిత రాష్ట్రాలు డిమాండ్ చేశాయి.
ఆదాయ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. జిఎస్టి ఆదాయం పంచుకునే విధానంలో మార్పులు లేదా పరిహారం చెల్లించడాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాల్సిందిగా కోరాయి. జిఎస్టి మండలి నిర్ణయాలకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రాలు ప్రస్తావించాయి.