మహారాష్ట్రలో దాదాపు తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత, మహా వికాస్ అఘడి ప్రభుత్వం తుదకు బుధవారం రాత్రి పడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆయన శివసేన-నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) కాంగ్రెస్ పార్టీల సంకీర్ణం ఎంవిఏ ప్రభుత్వంకు అధినేతగా కొనసాగారు. సుప్రీంకోర్టు గురువారం బలపరీక్ష(ఫ్లోర్ టెస్ట్)కు ఆదేశించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఠాక్రే రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశియారి ఆమోదించడమే కాక, తదుపరి ఏర్పాటు జరిగే వరకు ఆయనను కొనసాగాల్సిందిగా కోరారు. బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ 31 నెలల తర్వాత తిరిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని భావిస్తున్నారు. బలపరీక్షకు గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. దానితో రాజీనామా తప్పలేదు.
ఆయన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గురువారం విశ్వాస పరీక్షకు నిలవాల్సిందేనని బుధవారం తీవ్రవాదోపవాదాలు తరువాత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకుని, తీర్పు తరువాత కొద్ది సమయానికే ఆయన రాజీనామా ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తానని పేర్కొన్న థాకరే దేశంలో ప్రజాస్వామ్యం నిలవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు రూలింగ్ తరువాత సిఎం రాజీనామాతో రాష్ట్రంలోని శివసేన, ఎన్సిపి , కాంగ్రెస్ పార్టీల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది.
గురువారం నాటి బలపరీక్ష ఫలితం ఏ విధంగా ఉన్నా దానిని తాము జులై 11వ తేదీన రెబెల్స్ పిటిషన్లు, సర్కారు, డిప్యూటీ స్పీకర్ వ్యాజ్యాల విచారణల తరువాతనే బలపరీక్ష ఫలితం అమలులోకి వస్తుందని సుప్రీంకోర్టు రూలింగ్లో తెలిపింది. అయితే ఈ వివరణ అంశం జోలికి వెళ్లకుండా ఇప్పటికే సొంత పార్టీ శివసేనలో మైనార్టీ నాయకుడిగా మారిన ఉద్ధవ్ రాజీనామాకు దిగారు.
సుప్రీంకోర్టు రూలింగ్ తరువాత ఉద్ధవ్ ఆన్లైన్లో ఫేస్బుక్ ద్వారా స్పందిస్తూ తాను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆయన శివసేన జట్టు కేవలం 15 మంది ఎమ్మెల్యేల బలహీనతను చాటుకుంది. మరోవైపు బిజెపి పాలిత రాష్ట్రంలోని అసోంలోని గువహతిలో క్యాంపు రాజకీయాలకు దిగిన అసమ్మతినేత ఏక్నాథ్ షిండే వర్గీయుల బలం క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
బుధవారం ముంబైకి చేరుకునేందుకు షిండే వర్గం గువహతి ఫైవ్స్టార్ హోటల్ను ఖాళీ చేసి వచ్చే దశలో సుప్రీంకోర్టులో ఉద్ధవ్ పిటిషన్ గురించి తెలియడంతో వారు కొంత సేపు గువహతిలోనే ఆగి తర్వాత నేరుగా ముంబైకి కాకుండా గోవాకు తరలివెళ్లారు. ఉద్ధవ్ పిటిషన్పై రాత్రివరకూ విచారణ జరిగింది.
గురువారం అసెంబ్లీలో బలపరీక్షకు దిగితేనే మంచిదని శరద్ పవార్, ఇతరులు సూచించినట్లు అయితే థాకరే తమ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించినట్లు తెలిసింది. కేవలం ఫేస్బుక్ ద్వారానే సంక్షిప్తంగా స్పందించిన థాకరే తరువాత గవర్నర్కు రాజీనామా సమర్పించేందుకు ఆయన రాజ్భవన్కు వెళ్లారు.
బలపరీక్ష పరిణామాలు ఎలా ఉంటాయనేది తనకు తెలుసునని, అయితే ఈ దశలో రేపు గురువారం శివసైనికుల రక్తం చిందుతుందని ఇది తనకు ఇష్టం లేదని అందుకే ముంబై ప్రశాంతతకు తాను రాజీనామా నిర్ణయం తీసుకుని ఈ రాత్రి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తమకు సహకరించిన కాంగ్రెస్కు , ఎన్సిపికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు థాకరే తెలిపారు.
తాను ప్రోత్సాహించిన వారే చివరికి ఈ విధంగా ఇప్పుడు వెన్నుపోట్లకు దిగారని ఉద్ధవ్ రెబెల్స్పై సౌమ్యంగానే విరుచుకుపడ్డారు. అనూహ్యంగానే అధికారంలోకి వచ్చాను. అదే విధంగా వెళ్లిపోతున్నానని తెలిపారు. శివసేన ఓ కుటుంబం, దీనిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, తాను ఎక్కడికి వెళ్లడం లేదని, మద్దతుదార్లను కూడగట్టుకుని తిరిగి బలోపేతం అవుతానని ఈ సందర్భంగా ప్రకటించారు.