ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వివిధ రాష్ట్రాల ర్యాంకులను విడుదల చేశారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2020 అమలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకింగ్లను కేంద్ర ప్రభుత్వం నాలుగు విభాగాల్లో ఇచ్చింది.
టాప్ అచీవర్స్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో గుజరాత్ నిలిచింది. మూడవ స్థానంలో తమిళనాడు, నాల్గవ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో హర్యానా, కర్ణాటక, పంజాబ్ ఉన్నాయి, అచీవర్స్ కేటగిరిలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రద్రేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
ఆశావహులు (అస్పిరెర్స్) కేటగిరిలో అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మరోవైపు.. ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ కేటగిరిలో అండమాన్, నికోబార్, బీహార్, చండీగఢ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిలిచాయి.
తగినంత యూజర్ డేటా లేనందున సిక్కిం, మిజోరాం, అరుణాచల్ప్రదేశ్, లక్షద్వీప్, లడఖ్ ఫీడ్బ్యాక్ పొందలేకపోయాయి. మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ 97.89 శాతం స్కోర్ను సాధించగా, రెండవ స్థానంలో నిలిచిన గుజరాత్ 97.77 శాతం స్కోర్ను సాధించింది. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహం కోసం భూముల కేటాయింపుతో పాటు పన్నుల్లో రాయితీలు, కార్మిక చట్టాల్లో పలు సవరణలను రాష్ట్రం చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న నిర్విరామ కృషికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సాధించిన ర్యాంకు నిదర్శనమని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర సూక్ష్మ మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఇ) మంత్రిత్వశాఖ నిర్వహించిన ఉద్యమి భారత్ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ ర్యాంకును రాష్ట్రం కైవసం చేసుకోవడం ఇది వరుసగా రెండవ సారని గుర్తు చేశారు.