టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉంటూ, ఆయన వరుసగా 1989 నుండి గెలుస్తూ వస్తున్న కుప్పంలోనే ఆ పార్టీని కట్టడి చేయాలనీ అధికార వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టిడిపిని మట్టి కురిపించారు.
రానున్న ప్రమాద ఘడియలను పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఈ మధ్య కుప్పంలో తరచుగా పర్యటిస్తూ ఉండడమే కాకుండా, అక్కడ ఓ సొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుపై బలమైన అభ్యర్థిని నిలబెట్టితే, ఆయన దృష్టిని రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల నుండి మళ్లించవచ్చని వైసీపీ నాయకత్వం భావిస్తున్నది.
ఇప్పటివరకు వైసీపీ తరుపున కుప్పంలో ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి అభ్యర్థి చతికిలబడ్డారు. సరైన ప్రత్యర్థి కోసం వైసీపీ గాలిస్తూనే ఉంది. తొలుత రామచంద్రారెడ్డి తన సోదరుడి కుమారుడిని పోటీకి దింపాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు సుప్రసిద్ధ నటుడు విశాల్ ను పార్టీ అభ్యర్థిగా దించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
విశాల్ పేరుకు తమిళ నటుడు అయినా, తెలుగు మూలాలు గల వ్యక్తి, పైగా రెడ్డి సామజిక వర్గంకు చెందిన వారే కాకుండా, తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితులు. కుప్పం నియోజకవర్గంలో తమిళ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీనిర్మాత కుమారుడయిన విశాల్ను కుప్పం బరిలోకి దించాలని వైసిపి భావిస్తున్నది. ఇప్పటికే దీనిపై విశాల్తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
ఈసారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసిపి గట్టి పట్టుదలతో పనిచేస్తుంది. ఆ ఉద్దేశంతోనే సరైన అభ్యర్థి’ని అన్వేషించే క్రమంలో వైసిపి దృష్టి విశాల్ రెడ్డిపై పడింది. ‘పందెంకోడి’గా తెలుగు ప్రేక్షకులకు హీరో విశాల్ సుపరిచితులు. తెలుగు కుటుంబానికి చెందిన విశాల్ తమిళ సినీ పరిశ్రమలోనూ ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఆయన తండ్రి జీకే రెడ్డి సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. కుప్పం ప్రాంతంలో ఆయనకు గ్రానైట్ గనులు, పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇలా కుప్పం ప్రాంతంతో విశాల్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను చంద్రబాబుపై పోటీకి నిలపాలని వైసిపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రచారాన్ని మంత్రి రామచంద్రారెడ్డి ఖండించారు. తమ అభ్యర్థి భరత్ అని స్పష్టం చేస్తూ ఇదంతా `ఎల్లో మీడియా’ ప్రచారం అంటూ కొట్టిపారేసారు. గత ఎన్నికలలో చంద్రబాబుపై పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడే భరత్. చంద్రమౌళి ఎన్నికల తర్వాత మృతి చెందారు. భరత్ ప్రస్తుతం వైసిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే, విశాల్ పోటీ చేయబోతున్నారనే కధనాలు మొదటగా వైసిపి శ్రేణుల నుండే సోషల్ మీడియాలో వ్యాపించడం గమనార్హం.