దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని చెబుతూ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. శనివారం జలవిహార్లో సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొంటూ ఇది రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంగా తెలిపారు.
శంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని చెబుతూ విశాల భారత పరిరక్షణ కోసమే తమ పోరాటమని యశ్వంత్ వెల్లడించారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబుతూ రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది అని సిన్హా తెలిపారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో విద్వేష పూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదని హితవు చెప్పారు.
విద్వేషాన్ని పెంచి పోషించే ఆగడాలు జరుగుతుంటే ప్రధాని మౌనం వహించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో రేపు జరగనున్న బీజేపీ బహిరంగ సభలోనైనా ఆ అంశాల గురించి ప్రధాని మాట్లాడుతారో..లేదో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. .మోడీ ప్రతినెలా మన్ కీ బాత్ చెబుతారు. కానీ ఒక్కసారి కూడా ప్రజల మన్ కీ బాత్ వినరని ఎద్దేవా చేశారు.
గత 8 ఏళ్ల పాలనలో మోదీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నేను ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఈడీ నా శాఖ పరిధిలోనే ఉండేది. కానీ అప్పట్లో నాకు ఈడీని దుర్వినియోగం చేయాలనే దురాలోచన రానే రాలేదు. విపక్షాలపైకి ఈడీ ఉసిగొల్పాలనే పన్నాగాలు కూడా పన్నలేదు”అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.
విపక్షాల నాయకులను అవమానించడమే లక్షంగా ఎన్డీయే సర్కారు ముందుకు సాగుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెరాస ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకముందు కేసీఆర్ మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలికారు. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గలవారని, భారత రాజకీయాల్లో గొప్ప వ్యక్తి అని తెలిపారు. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకే.. పార్లమెంటేరియన్లంతా ఆత్మ ప్రభోదానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల పెద్ద కంపెనీలన్నీ కూడా దేశం నుంచి వెళ్లిపోయాయని, మోదీని చూసి పెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని కేసీఆర్ ధ్వజమెత్తారు. శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాటు ని .మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్మెన్లా వ్యవహరిస్తున్నారని అభివర్ణించారు. కేంద్ర నిర్ణయాలతో రైతులు, సైనికులు, ఉద్యోగులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.