ఆఫ్ఘనిస్థాన్లో ప్రతి రోజు కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆప్ఘనిస్థాన్ పార్లమెంటు మాజీ డిప్యూటీ స్పీకర్ ఫాజియా కూఫీ తెలిపారు. అవకాశాలు లేకపోవడం, మానసిక అనారోగ్యం వంటివి మహిళల ప్రాణాలు తీసేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవాలోని మానవ హక్కుల మండలిలో మహిళల హక్కుల సమస్యపై అత్యవసర చర్చ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగింది. తాలిబన్ దేశంలో మహిళలు, బాలికలకు విద్యాహక్కును కలిగి ఉండటంతో పాటు ప్రజాజీవితంలో భాగస్వామ్యం అయ్యేలా తాలిబన్ చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది.
ఆఫ్ఘన్ మహిళలు దశాబ్దాలుగా తమ హక్కులు కోల్పోవడంతోపాటు తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక వారి పరిస్థితి మరింత దుర్భంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్ఆర్సీ అత్యవసరంగా మహిళలు, బాలికల హక్కులపై చర్చించింది. ఈ సందర్భంగా ఫాజియా మాట్లాడుతూ దేశంలో ప్రతి రోజూ కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
9 ఏళ్ల బాలికలను అమ్ముకుంటున్నారని, ఇందుకు ఆర్థిక ఒత్తిడి ఒక్కటే కారణం కాదని తమకు, తమ కుటుంబానికి భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపారు. ఇది సాధారణ విషయం కాదని ఫాజియా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి పునీత్ అగర్వాల్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో మహిళలను ప్రజా జీవితం నుండి దూరం చేసే ప్రయత్నాలు పెరిగాయని భారత్ పరిశీలించినట్లు చెప్పారు. ‘అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా పౌరులు, చిన్నారులు, బాలికలు, మహిళల ప్రాథమిక హక్కులతో పాటు వాక్ స్వాతంత్య్రం, విద్య, వైద్య సంరక్షణ వంటి వాటికి విఘాతం కలుగుతుంది’ అని పేర్కొన్నారు.
ఆ దేశంలో మహిళలు, బాలికలకు విద్యా హక్కుతో సహా వారి హక్కుల సంరక్షణకు భరోసానివ్వాలని, రెండు దశాబ్దాలుగా పోరాడి సాధించిన వాటిని కోల్పోకుండా చూడాలని చెబుతున్న ఇతర దేశాలకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు.