వైసిపి పాలకులు క్రిమినల్స్కు వత్తాసు పలుకుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విషఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలకు సమయం లేదు కానీ ప్రెస్మీట్లు పెట్టి బూతులు తిట్టడానికి సమయం ఉంటుందా అని ప్రశ్నించారు.
”జనవాణి – జనసేన భరోసా” పేరుతో విజయవాడలో ఆదివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలనుంచి 427 మంది ప్రతినిధులు సుమారు 25 లక్షల మందికి సంబందించిన సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెబుతూ సామాన్య ప్రజానీకం సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు వారి గొంతుకగా తాము నిలుస్తామని, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.
వైసిపి అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ధ్వజమెఎత్తుతూ ఎవరైనా పథకాలు గురించి ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని, అంతటితో ఆగకుండా పోలీసు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా ఎస్సి, ఎస్టి సెక్షన్ల కింద కేసులు పెడుతున్నట్లు పలువురు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో మంచినీరు కలుషితమైందని, ఉధ్థానంలో అంటే ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా ఉందని, ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం, ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్యపేట, మైలవరం, ఎ.కొండూరుల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. విజయవాడ సెంట్రల్, మైలవరం, విజయవాడ పశ్చిమలో పొల్యూషన్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఫ్లోరైడ్ సమస్యకు సిఎం ఏమీ చేయలేకపోతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
విదేశీ విద్యా పథకం నిధులను ప్రభుత్వం నిలిపివేయడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా విద్య అభ్యసించండి, ఫీజులు కడతామని చెప్పిన వైసిపి అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు.