సంచలనం సృష్టించిన అమరావతి కెమిస్ట్ ఉమేష్ హత్య కేసు నిందితులు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు మంగళవారం తెలిపారు. అమరావతి కోర్టు ముందు వీరిని హాజరు పరిచామని చెప్పారు. నాలుగు రోజుల ట్రాన్సిస్ రిమాండ్కు కోర్టు ఆదేశించింది.
మహారాష్ట్రలోని అమరావతిలో జూన్ 21వ తేదీ రాత్రి 10-10.30 గంటల మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉమేష్పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఉమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రాజస్తాన్లోని ఉదయ్ పూర్లో టైలర్ కన్హయ్యలాల్ దారుణ హత్యకు వారం రోజుల ముందు అమరావతి కెమిస్ట్ హత్యా ఘటన జరిగింది.
అమరావతిలో ఉమేష్ మెడికల్ షాపును నడుపుతున్నాడు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా ఒక పోస్ట్ను ఆయన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఆ పోస్టును తన కస్టమర్లకు షేర్ చేశారని, పొరపాటుగా కొందరు ముస్లిం సభ్యులుకు కూడా పోస్ట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ హత్య కేసులో పట్టుబడిన ఏడుగురు నిందితులను ఈనెల 8వ తేదీలోగా ముంబయి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో ముదసర్ అహ్మద్ (22), షారూక్ పథాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22), యూసుఫ్ ఖాన్ (32)తో పాటు హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షేఖ్ ఇర్ఫాన్ షేఖ్ రహీమ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.