కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహంతో పలాయనం దేశాధ్యక్షుడు గొటబయా రాజపక్షా పలాయనం చిత్తగించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రంగా మారింది. అఖిల పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు వీలుగా రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి రణీల్ విక్రమ్ సింఘే తెలిపారు. మరోవంక, అధ్యక్షుడు కూడా ఈ నెల 13న రాజీనామా చేయనున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
అధ్యక్షుడుగా గొటబయా రాజపక్సా రాజీనామా చేస్తే ఆయన స్థానంలో రణీల్ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొటబయా రాజపక్సా పలాయనం నేపథ్యంలో శ్రీలంక నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకలోకి సూట్కేసులు తరలిస్తున్న వీడియోలు దుమారం రేపాయి. ఆ సూట్కేసులు అధ్యక్షుడు రాజపక్సావేనని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది.
పలాయనం చిత్తగించిన అధ్యక్షుడు గొటబయా రాజపక్స సురక్షితంగానే ఉన్నారని సైనిక వర్గాలు వెలిపాయి. ‘ఆయన ఇప్పటికీ అధ్యక్షుడే. అందువల్ల మిలటరీ యూనిట్ ఆయనకు రక్షణ కల్పిస్తోంది.’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు తాను సుముఖం అని, అవసరం అనుకుంటే రాజీనామా చేస్తానని వెల్లడించిన సింఘే తరువాత కొద్దిసేపటికే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు.
‘ప్రజల భద్రతతో సహా ప్రభుత్వం కొనసాగేందుకు వీలుగా పార్టీ నేతలు సూచించిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నాను. అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇందుకు వీలుగా రాజీనామా చేస్తాను’ అని రణీల్ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు.
కాగా, వారం రోజులలో పరిస్థితి చక్కబడుతుందని, ఆహార ధాన్యాలు అందుతాయని, ఐఎంఎఫ్ స్పందిస్తుందని, ఇంధన నిల్వలు దండిగా ఉంటాయని ప్రధాని దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలు కోరుతున్నట్లు అఖిలపక్షంతోనే అంతా బాటుంటుందనుకుంటే రాజీనామాకు సిద్ధమని ఆయన తెలిపినట్లు ప్రధాని మీడియా విభాగం శనివారం ఓ ప్రకటన వెలువరించింది. దేశ భద్రత, జనం క్షేమం సంక్షేమం కీలకం. ఇందుకు ఆయన ఏదైనా చేస్తారని స్పందించింది.
మరోవైపు.. లంకేయుల నిరసనల నేపథ్యంలో లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇలా ఉండగా, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.