ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులు అందులో పెద్ద ఎత్తున నోట్లకట్టలు కనిపించడంతో ఆశ్చర్యంకు గురయ్యారు. ఆ భవనం అంతటా కలియతిరుగుతున్న నిరసనకారులు ఇంకా ఆ భవనాన్ని విడిచి వెళ్లలేదు.
మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో తప్పించుకుపోయిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆచూకీ లభించలేదు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో పెద్ద ఎత్తున నగదు అధ్యక్షుడి నివాసంలో గుర్తించారు.
నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ, వ్యాయామ కేంద్రంలో కసరత్తులతో సందడి చేశారు. గుట్టలుగా ఉన్న కరెన్సీ నోట్లను నిరసనకారులు గుర్తించి, వాటిని భద్రతాధికారులకు అప్పగించినట్లు ఆ దేశ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు.
మరోవంక, ఆందోళనకారులు భవనంలోని హై సెక్యూరిటీ బంకర్ను చూసి ఆశ్చర్యపోయారు. కబోర్డులా ఉన్న ఓ తలుపు తెరిచి చూస్తే ఆ తలుపు వెనక ఉన్న దారిలో వెళ్లి చూస్తే విలాసవంతమైన హై సెక్యూరిటీ బంకర్ కనిపించింది. కాగా, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
మరోవంక, శ్రీలంక సంక్షోభానికి గల కారణం రష్యా ‘దురాక్రమణ యుద్ధమే’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీగాక ఇటీవలే ఆంటోని బ్లింకెన్ ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని విడిచిపెట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రష్యా విధించిన ఆంక్షలే.. ఒకరకంగా శ్రీలంక సంక్షోభానికి కారణమై ఉండోచ్చని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రస్తుతం శ్రీలంక ఆహారం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు వంటి సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న సంగతి తెలిసిందే.