మరోవంక, హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేత కుల్దీప్ బిష్ణోయ్ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆదివారం కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కుల్దీప్ బిజెపిలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో నడ్డాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు కుల్దీప్ బిష్ణోయ్ను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. ఆయన బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు ఓటు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బిష్ణోయ్ తమ పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
మాజీ సీఎం దీపిందర్ సింగ్ హుడా అనుచరుడిని హరియాణా కాంగ్రెస్ చీఫ్గా నియమించడంపై బిష్ణోయ్ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్కు ఓటు వేయలేదు. తన మనస్సాక్షి చెప్పిన వ్యక్తికే ఓటు వేశానని ఎన్నికల అనంతరం ప్రకటించారు.
గోవా కాంగ్రెస్ లో ముసలం
మరోవంక, గోవా కాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది. పార్టీ ఎమ్యెల్యేలు పలువురు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దానితో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న మైఖెల్ లోబోను ఆదివారం ఆ పదవి నుంచి పార్టీ నాయకత్వం తొలగించింది.
అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆ పార్టీ నాయకత్వంకు కలవరం కలిగిస్తున్నది. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా, అందులో కాంగ్రె్సకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష నేత లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్లు బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటూ ఫిరాయింపులు జరిగేలా కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ గోవా ఇన్ఛార్జి దినేష్ గుండూరావు ఆరోపించారు. అందుకే లోబోను పదవి నుంచి తొలగించినట్టు చెప్పారు.
ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి 20 మంది సభ్యులు ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన మరో అయిదుగురు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. తాము బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎప్పుడైనా ఆ పార్టీలో చేరవచ్చని కొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు స్పష్టం చేస్తున్నారు.