వచ్చే సంవత్సరం నాటికి జనాభా పరంగా భారత్ చైనాను అధిగమించి, అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా సంఖ్య 800 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది.
1950 తర్వాత ప్రపంచ జనాభా అత్యంత తక్కువ వృద్ధి రేటును చూస్తోంది. 2020లో జనాభా వృద్ధి రేటు ఒక శాతం లోపునకు పడిపోయింది. 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లకు ప్రపంచ జనాభా విస్తరించనుంది. 2080 నాటికి 1040 కోట్లకు చేరి, 2100 నాటికి అదే స్థాయిలో జనాభా ఉంటుంది.
ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్ల స్థాయిలో ఉంది. 2050 నాటికి పెరుగుతుందని అంచనా వేస్తున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా ఎనిమిది దేశాల్లోనే ఉంటుంది. మిగతా ఏడు దేశాలు.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా
ప్రపంచంలో అతిపెద్ద దేశాల మధ్య జనాభా వృద్ధి రేట్లలో ఉన్న అసమానతలే వాటి స్థానాలు మారేందుకు దారితీస్తున్నాయి. భారత్ జనాభా 2050నాటికి 166.8 కోట్లకు పెరగనుంది. అప్పుడు చైనా జనాభా 131.7 కోట్ల వద్దే ఆగిపోనుంది.
2010 నుంచి 2021 మధ్య పది లక్షల మందికిపైగా వలస వెళ్లిపోతున్న పది దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అత్యధికంగా పాకిస్థాన్ నుంచి 16.5 మిలియన్ల మంది బయటకు వెళ్లిపోయారు. 2019లో ప్రపంచ ఆయుర్దాయం 72.8 సంవత్సరాలు కాగా, 2021లో అది 71.0 సంవత్సరాలకు పడిపోయింది. చాలా వరకు కరోనా మహమ్మారే ఇందుకు కారణం.