శ్రీలంకలో ఏర్పడ్డ తీవ్ర సంక్షోభంతో కడుపు మండిన ప్రజలు తిరుగుబాటు చేయడంతో భయాందోళనకు గురైన ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుండి పరారయ్యాడు.మరోవంక, అధ్యక్ష పదవి చేపట్టడానికి ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస సంసిద్ధత వ్యక్తం చేశారు.
తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక ప్రజాగ్రహాలతో రగులుతుండంతో తమ పదవులకు అధ్యక్ష, ప్రధాని ఇద్దరూ రాజీనామా చేయవలసి రావడంతో అధికార పదవులు చేపట్టడానికి నాయకులెవ్వరూ సాహసించడం లేదు. అయితే, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకొచ్చారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ గొటబాయ రాజపక్సా అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపిందని తెలిపారు. ఒక వేళ ఖాళీ ఏర్పడితే తాను నామినేషన్ వేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని, శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్సా కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సజిత్కు కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో అన్నిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు అంగీకరించారు.
వచ్చే వారం పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు. బుధవారం గొటబాయ తన అధ్యక్ష పదవికి రాజీనామా బుధవారం రాజీనామా చేయాల్సి ఉండగా.. ఆయన దేశాన్ని విడిచిపెట్టారు.
అంతకముందు గొటబయ, ఆయన తమ్ముడు, ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్సను మంగళవారం దేశం దాటకుండా ప్రజలు అడ్డుకోగా.. అప్పటికి వెనుదిరిగినప్పటికీ… కొంత సమయం తర్వాత సైనిక విమానంలో దేశాన్ని విడిచి పారిపోయారు. భార్య, తన ఇద్దరు భద్రతా అధికారులతో కలిసి మాల్డీవులుకు వెళ్లినట్లు ఆ దేశ వైమానిక దళం ధ్రువీకరించింది. మాల్డీవుల కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 3 గంటలకు చేరుకున్నారని తెలుస్తోంది. గత వారం నుండి ప్రజలు ప్రభుత్వంపై తిరుగబడ్డారు. దీంతో అప్పటి నుండి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
రాజపక్స రాజీనామా సమర్పించగానే, అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 15 న పార్లమెంటు సమావేశమై అధ్యక్ష పదవి ఖాళీని అధికారికంగా ప్రకటిస్తుంది. 19న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే గరిష్ఠంగా 30 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ కొనసాగవచ్చు. ఆలోపు పార్లమెంటు తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. గొటబాయ పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉంది. కాబట్టి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆ రెండేళ్లే పదవిలో కొనసాగుతారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీలంకలో ఎవరు గద్దెనెక్కనున్నారో, తీవ్ర సంక్షోభం నుండి ఎవరు శ్రీలంకను బయటపడేయనున్నారో.. వేచి చూడాలి.
ఇలా ఉండగా, గొటబయా శ్రీలంకను విడిచిపెట్టేందుకు తాము సాయం చేశామనే వార్తలను భారత్ ఖండించింది. అదేవిధంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలకు మద్దతు ఇస్తామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు శ్రీలంకలో భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. ‘శ్రీలంక నుండి గొటబయ పారిపోయేందుకు భారత్ సాయమందించిదన్న ఊహాజనిత, నిరాధారమైన మీడియా కథనాలను ఖండిస్తున్నాం’ అని పేర్కొంది.