ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో భారత్కు భారీగా దిగుమతి సుంకాలు ఎగ్గొట్టింది. ఒప్పో ఇండియా రూ.4389 కోట్ల పైగా కస్టమ్స్ డ్యూటీని చెల్లించలేదని తమ తనిఖీల్లో తేలిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ (డిఆర్ఐ) వెల్లడించింది. ఈ అంశంలో షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం.
మనీలాండరింగ్ ఆరోపణలపై ఇటీవల ఒప్పో ఇండియా కార్యాలయాలు, కీలక మేనేజ్మెంట్ ఉద్యోగుల కార్యాలయాలు, నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి), డిఆర్ఐ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కంపెనీ పలు అక్రమాలకు పాల్పడటం ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు డిఆర్ఐ అధికారులు గుర్తించారు.
1962లోని నిబంధనల ప్రకారం ఒప్పో ఇండియా, దాని ఉద్యోగులు ఒప్పో చైనాపై సంబంధిత జరిమానాలను కూడా ప్రతిపాదిస్తున్నట్లు డిఆర్ఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్సేల్ ట్రేడింగ్, మొబైల్ ఫోన్ల పంపిణీ, యాక్సెసరీస్ల వంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పో, వివోతో పాటు రియల్మీ, వన్ప్లస్, ఐక్యుఒఒలను చైనాకు చెందిన బిబికె ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ నిర్వహణలో ఉన్నాయి.
కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ అధికారులు, ఒప్పో ఇండియా దేశీయ సరఫరాదారులను డిఆర్ఐ అధికారులు ప్రశ్నించారు. పరికరాల దిగుమతి సమయంలో కస్టమ్స్ అధికారులకు తప్పుడు పత్రాలు, సమాచారం అందించామని దర్యాప్తులో ఒప్పో అధికారులు అంగీకరించారని తెలిసింది.
దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరణలో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రకటన చేసినట్టు తేలింది. పన్ను ఎగవేత ద్వారా ఒప్పో ఇండియా రూ.2981 కోట్ల విలువైన అక్రమ మినహాయింపు ప్రయోజనాలను పొందిందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. రాయల్టీ, లైసెన్స్ ఫీజులకు సంబంధించిన నిబంధనల్ని ఉల్లంఘించడం ద్వారా మరో రూ.1,408 కోట్ల ప్రయోజనం పొందినట్లు వెల్లడించింది. 2017-21 మధ్య కాలంలో ఇండియాలోని అనుబంధ సంస్థల ద్వారా రూ.62,476కోట్ల ఆదాయాన్ని చైనాకు తరలించిందని ఇడి వర్గాల ఆరోపణ.
మనీలాండరింగ్ ఆరోపణలపై ఇటీవల వివో బ్యాంక్ ఖాతాలను ఇడి స్తంబింపజేసింది. ఈ అంశంలో ఆ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఖాతాలను సీజ్ చేయడం ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేమని తెలిపింది. దీంతో పలు షరుతులతో ఆయా బ్యాంకుల ఖాతాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. వారంలోగా రూ.945 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని వివోను ఆదేశించింది. అదే విధంగా ఆయా ఖాతాల్లో రూ.250 కోట్ల నిల్వ ఉంచాలని తెలిపింది.