దేశాన్ని దివాలా తీయించి, ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసిన ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడంతో దేశం వీడి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మూల్దీవుల్లో తొలి మజిలీ, సింగపూర్లో మలి మజిలీ వేసిన ఆయన గురువారం అక్కడి నుంచే తన రాజీనామా లేఖను పంపారు.
అక్కడకు చేరుకున్న వెంటనే ఇ మెయిల్ ద్వారా తన రాజీనామా లేఖను స్పీకర్ అబె వర్దనెకు పంపారు. రాజీనామా విషయం తెలియగానే శ్రీలంకలో పెద్ద ఎత్తున ప్రజలు సంబరాలు చేసుకోవడం కనిపించింది. అధ్యక్ష భవనం, ప్రధాన మంత్రి నివాసాలలో విన్యాసాలు చేస్తూ వచ్చిన ప్రదర్శకులు బైటకు వచ్చి వెళ్లిపోయారు.
ఇదిలా వుండగా, ప్రశాంతంగా వుండాల్సిందిగా సైన్యం ప్రజలను కోరుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా తగు చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని ఆర్మీ తెలిపింది.
స్వదేశంలో ప్రజల తిరుగుబాటును తప్పించుకుని మాల్దీవులకు పారిపోయిన 33 గంటల తర్వాత గొటబయా ఆ దేశాన్ని కూడా వీడి సౌదీ ఎయిర్లైన్స్ విమానం ద్వారా సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ విదేశాగ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అటు నుంచి సౌదీ అరేబియాకు గొటబయా వెళ్తారని వార్తలస్తున్నాయి.
వ్యక్తిగత పర్యటన కిందే గొటబయాను తమ దేశంలోకి అనుమతించినట్లు సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. ‘ఆయన రాజకీయ శరణార్థిగాఆశ్రయం ఏమీ కోరలేదు. మేం ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదు. సింగపూర్ సాధారణంగా ఆశ్రయం కోరే అభ్యర్థనలను అనుమతించదు.’ అని పేర్కొంది.
లాంఛనంగా రాజీనామా అందకపోతే రాజపక్సా ఆ పదవిని ఖాళీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే ఇ-మెయిల్ ద్వారా రాజీనామా లేఖ అందింది. రాజపక్సాకు ఆతిథ్యమివ్వాలన్న మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయంపై మాల్దీవుల ప్రతిపక్షాలతో పాటు శ్రీలంక ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
దీంతో గొటబయా మాల్దీవులను వీడి సింగపూర్కు చేరారు. మొదట అమెరికా పారిపోయేందుకు యత్నించారు. అమెరికా వీసా ఇవ్వనిరాకరించడంతో ఆ యోచన విరమించుకున్నారు.
గొటబయాతో ప్రధాని విక్రమసింఘె కూడా తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. యుఎన్పి తరపున ఏకైక ఎంపీగా ఉన్న వికమ్ సింఘెను గొటబయా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. రాజపక్సెకు తొత్తుగా వ్యవహరిస్తూ, అధికారంపై యావతో దేశవ్యాపితంగా ఎమర్జెన్సీ విధించిన విక్రవ్ సింఘెపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
గురువారం ఉదయానికి పార్లమెంట్ చుట్టుపక్కల ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. అక్కడకు దారి తీసే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ప్రవేశ మార్గానికి ఎదురుగా గల పార్క్్లో పలువురు ఆందోళనకారులు మకాం వేశారు. మరోవైపు నెమ్మదిగా సాధారణ జన జీవనం నెలకొంటోంది. చాలావరకు దుకాణాలు తెరిచారు. బుధవారం నాటి ఆందోళనలు, నిరసనల్లో ఒక వ్యక్తి మరణించగా, 84 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.