ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 50 దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదవగా, ఒక్కరు మరణించారు. ఈ వైరస్పై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరించింది.
తాజాగా, భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయిందని మేరకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
ఈ వ్యాధి నిర్వహణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సమీప ప్రాంతాల్లో ఈ వైరస్ లక్షణాలు కన్పించినా, మంకీపాక్స్ కేసులు నమోదైనా, లేదా మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు, మంకీపాక్స్ కేసులను నిర్ధారించేందుకు 15 వైరస్ రీసర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబరేటరీస్ సిద్ధంగా ఉన్నట్లు ఐసిఎంఆర్ శుక్రవారం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిన ప్రయాణికులు.. అక్కడ అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని, జంతు సంబంధిత ఆహార పదార్థాలను తీసుకోకూడదని సూచించింది.
విదేశాల్లో ఉన్న సమయంలో రోగులు, ముఖ్యంగా చర్మ సంబంధ వ్యాధులు, జననేంద్రియ వ్యాధులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. రోగులు ఉపయోగించిన దుస్తులు, పడక, ఇతర వస్తువులను ఉపయోగించకూడదని హెచ్చరించింది.
అక్కడ చనిపోయిన లేదా బతికున్న ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాజీలను నేరుగా తాకకూడదని, ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల మాంసంతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదని తెలిపింది.