పోలీసులు ఏ వ్యక్తిని రౌడీగా ముద్ర వేయకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, నిఘా కోసం లేదా సమాచారాన్ని సేకరించేందుకు ఏ ఇంటికీ వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమపై రౌడీ షీట్లు తెరవడాన్ని కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
పోలీసులు అనుచితమైన నిఘా వేయడం రౌడీ షీట్లు తెరవడం ద్వారా వారిపై రౌడీలుగా ముద్ర వేయడం వారి ఫోటోలను సేకరించడం లేదా ప్రదర్శించడం చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తుల గోప్యత హక్కును ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.
రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం పోలీసు స్టాండింగ్ ఆర్డర్లు అర్హత పొందలేవని, చట్టం అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వారి ఇళ్లను సందర్శించడం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొంది. ఇక నుంచి ప్రస్తుత పోలీసు స్టాండింగ్ ఆర్డర్లతో పోలీసులు ఇలా చేయడం సాధ్యం కాదని తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా నిర్దారించారని పేర్కొంటూ పిటిషనర్లపై దాఖలు చేసిన అన్ని రౌడీ షీట్లను పోలీసులు మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు స్టాండింగ్ ఆర్డర్లు ఎటువంటి చట్టబద్ధమైన మద్దతు లేనివని, కేవలం డిపార్ట్మెంటల్ ఆదేశాలు మాత్రమేనని, కాబట్టి వాటిని చట్టం అని పిలవలేమన్న పిటిషనర్ల వాదనను కోర్టు అంగీకరించింది.
చట్టం అనుమతి లేకుండా పోలీసులు రౌడీ షీట్ తెరవడం లేదా కొనసాగించడం లేదా ఒక వ్యక్తికి సంబంధించిన డేటాను సేకరించడం సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పండుగలు లేదా ఎన్నికల సమయంలో లేదా వారాంతాల్లో నిందితులను లేదా అనుమానితులను పోలీసు స్టేషన్ లేదా మరెక్కడైనా పిలిపించకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఏ కారణం చేతనైనా వారిని పోలీస్ స్టేషన్ల వద్ద వేచి ఉండేలా చేయలేరని పేర్కొంది.
అయితే నేరాలను నిరోధించడానికి నేరస్తులపై నిఘా ఉంచడానికి చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నేరాల నివారణకు సమాచారం సేకరించాల్సిన అవసరం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిఘా మొదలైన అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించాలి లేదా తక్కువ సమయంలో చట్టం చేయాలని హైకోర్టు సూచించింది.