భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు.
భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం స్థానికంగా ఉన్న ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయని, అయితే వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.
భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించిన్నట్లు వెల్లడించాయిరు. వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలని కలెక్టర్ ను ఆదేశించఛాయారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలని, కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలని, బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పారు.
భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్ఛారు. కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడిందని, ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదని, కానీ ఇపుడు 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడిందని పేర్కొన్నారు.
దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు నా దృష్టికి వచ్చాయని చెబుతూ మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తొలుత భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. ములుగు జిల్లాలోని రామన్న గూడెంలో ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాలను చూస్తూ సీఎం ఏటూరునాగారానికి చేరుకున్నారు.
వరద బాధితులను పరామర్శించిన తమిళిసై
మరోవంక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఇటీవల భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు.
నీట మునిగిన పంట పొలాలను, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజలకోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సమయంలో మహిళలు కన్నీరు పెట్టుకుంటూ గవర్నర్ బాధలు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలను గవర్నర్ పరిశీలించారు. గవర్నర్ తమిళిసై స్వయంగా వరద బాధితులకు అన్నం వడ్డించారు.