కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
యానాంలోని ఓల్డేజ్ హోం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు సరఫరా చేస్తున్నారు. గత 4 రోజుల క్రితమే ఏటిగట్టు పరిసర ప్రాంతాలయిన ప్రాన్స్తిప్ప, ఫెర్రీ రోడ్డు, రాజీవ్ బీచ్, అయ్యన్నగర్, పరంపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజీవ్ బీచ్ మార్గం ద్వారా జెండా స్తంభం ప్రాంతం మీదుగా వరదనీరు యానం టౌన్ లోకి ప్రవేశించింది. దీంతో యానం జి.జి.హెచ్., చింతా వారి వీధి, జిక్రియా నగర్, బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. యానం జిజిహెచ్. కి వెళ్లడానికి దారి లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
సుమారు 800 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నట్లు తెలిసింది. 400 నుంచి 500 గృహాలు పూర్తిగా నీట మునిగాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదని కేవలం ఫెర్రీ రోడ్డు, రాజీవ్ బీచ్ ప్రాంతాలకు మాత్రమే వరద పరిమితం అయ్యేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ దఫా యానం టౌన్ లోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి
మరోవంక, గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరీవాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎపి విపత్తుల నిర్వహణ అధికారి తెలిపారు.
స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బఅందాలు ఉన్నాయన్నారు. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరదకు ప్రభావితమయ్యాయని చెప్పారు.
మరో 241 గ్రామల్లో వరదనీరు చేరింది. ఇప్పటివరకు 97,205 మందిని వరద ప్రాంతాల నుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. 84,734 మందిని 191 పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. 256 మెడికల్ క్యాంప్స్ను నిర్వహిస్తున్నామని, 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు.