వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల సరసన ఏపీని చేర్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘వైసీపీ నేత రోడ్ల మీద తిరిగితే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని నమ్మారు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. అధికారంలోకి వచ్చీ రాగానే జనాల పొట్ట కొట్టడం మొదలుపెట్టారు. ముందుగా రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఆ రోజు నుంచి జనసేన పోరాడుతునే ఉంది’ అంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన ఎమర్జెన్సీకి అమ్మ మొగుడులా మారిందని పవన్ మండిపడ్డారు. సమస్యలపై పోరాడాలంటే ప్రజలు భయపడుతున్నారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్భర పరిస్థితిలో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం సమస్యలను పరిష్కరించపోతే రాజకీయ నిర్ణయం తీసుకుంటాం… పోరాటం చేస్తాం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘‘నవరత్నాల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని మంటకలిపింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ సంవత్సరం 20 శాతం షాపులను తగ్గిస్తూ ఐదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు” అంటూ విమర్శించారు.
మద్యం పైనే రూ.8,300 కోట్లు అప్పు తెచ్చారని, మరో రూ.25 వేల కోట్లు మద్యం ద్వారా అప్పు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతల బినామీలు హైదరాబాద్లో కూర్చుని ఏపీ మద్యం అమ్మకాల్లో ప్రతీ లీటరుపై రూ.5 దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ తరువాతే ఇక్కడ కమీషనర్ మద్యం అమ్మకాలపై సంతకం పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆ బినామీల జాబితాను బయటపెడతామని పవన్ హెచ్చరించారు ‘‘రాష్ట్రంలో అమ్ముతున్న నాసిరకం మద్యంతో 5వేల మంది చనిపోయినట్లు అంచనా. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడపడుచుల పసుపు కుంకుమలు రాలిపోతాయి. ప్రజల సంపాదన అంతా ప్రభుత్వ పెద్దలే భోంచేస్తారు’’ అంటూ పవన్ తూర్పారపట్టారు.