శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరోసారి ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇటీవల ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా… మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే ఆదేశాలు జారీ చేశారు. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు విక్రమ సింఘే తెలిపారు.
1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఇటీవల శ్రీలంక మహింద యాపా అబేవర్దన ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో జులై 19న అధ్యక్ష ఎన్నిక ఉండబోతుందంటూ వెల్లడించారు.
ఈ క్రమంలోనే దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నేటి (జులై 18) నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజా నిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి.
అధ్యక్ష ఎన్నిక పక్రియ ప్రారంభం
మరోవంక, తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలైంది. తాత్కాలిక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసతో పాటు నలుగురు నాయకులు పోటీలో ముందున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు శనివారం పార్లమెంట్ సమావేశమైంది.
విక్రమసింఘే, ప్రేమదాసతో పాటు మార్క్సిస్ట్ జేవీపీ నాయకుడు అనుర కుమార దిశనాయకే, ఎస్ఎల్పీపీ తిరుగుబాటు నాయకుడు డల్లాస్ అలహప్పెరుమా కూడా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. జులై 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి రాజపక్స మిగిలిన పదవీకాలం అయిన 2024 నవంబర్ వరకు పదవిలో కొనసాగుతారు. రాజపక్స రాజీనామాతో అధ్యక్ష పదవి ఖాళీ అయ్యిందని శనివారం 13 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించిన పార్లమెంట్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. మంగళవారం వరకు అధ్యక్ష పదవికి దరఖాస్తులు తీసుకుంటామని, ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే బుధవారం ఓటింగ్ నిర్వహిస్తామని పార్లమెంట్ సెక్రెటరీ జనరల్ ధమ్మిక దాసనాయకే ప్రకటించారు.
అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు
ఇలా ఉండగా, శ్రీలంకలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభంపై చర్చించేందుకు మరోమారు అఖిలపక్ష సమావేశానికి భారత ప్రభుత్వం పిలుపునిచ్చింది. వచ్చే మంగళవారం ఈ సమావేశం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఆల్పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అనంతరం శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం అంశాన్ని వెల్లడించారు జోషీ. శ్రీలంక పరిస్థితులపై భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతారని చెప్పారు. శ్రీలంక సంక్షోభంలో భారత్ కలుగజేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కోరినట్లు తెలిపారు.