కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు దీర్ఘకాలం (లాంగ్ కొవిడ్) పాటు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 శాతం మంది బాధితుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా దాదాపు 12 వారాల పాటు ఈ లక్షణాలు బాధితులను వేధిస్తున్నట్టు తెలిపింది.
ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్లో ప్రచురితమైంది. అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన నిపుణులు మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యకాలంలో ఓ అధ్యయనం చేపట్టారు. అక్కడి సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్ రీసెర్చ్ జరిపిన సర్వే ఫలితాలను పరిగణన లోకి తీసుకుని అందులో దాదాపు 8 వేల మందిని పలు దఫాల్లో సంప్రదించి ఆరోగ్య వివరాలను సేకరించారు.
కరోనా సోకిన సమయంలో కనిపించిన లక్షణాలు 12 వారాలకు పైగా కొనసాగుతున్నట్టు 23 శాతం మంది వెల్లడించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా కనిపించే అలసట, జలుబుతోపాటు ఇతర లక్షణాలు దీర్ఘకాలం పాటు వేధించినట్టు వెల్లడించారు. 23 శాతం మంది దీనితో బాధపడుతుండటం అంటే లక్ష మందిలో ఈ సమస్య కనిపిస్తున్నట్లే అని పరిశోధనకు నేతృతం వహించిన వైద్య నిపుణులు క్వియావో పూ పేర్కొన్నారు.
దీన్ని నిర్ధారించేందుకు ప్రస్తుతం అనుసరిస్తోన్న పద్ధతుల వల్ల లాంగ్ కొవిడ్ను గుర్తించడం 10 నుంచి 90 శాతం వరకు మాత్రమే సాధ్యమవుతోందని చెప్పారు. ఇన్ఫెక్షన్ బారిన పడిన సమయంలో బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటివి లక్షణాలు లాంగ్ కొవిడ్కు ముందస్తు సూచికలు అని నిపుణులు పేర్కొన్నారు.
అయితే, మధుమేహం లేదా ధూమపానం మాత్రం లాంగ్ కొవిడ్కు చెప్పుకోదగిన కారణాలు కావని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాల తీవ్రత, ముప్పులను ముందుగానే అంచనా వేసి చికిత్స అందించడం ద్వారా బాధితులు సాధ్యమైనంత త్వరగా తిరిగి సాధారణ స్థితిని పొందే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.