పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచుకున్నారని, దీని వల్లే భద్రాచలానికి వరద వచ్చిందని, ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ నేతలను కోరారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.
వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 5 గ్రామాలు ఇచ్చేయాలని అంటున్నారని, భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రంతో మాట్లాడాలని గానీ, ఇలా వివాదం చేయకూడదని హితవు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురైన విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని బాధితులు అంటే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని మేం కూడా డిమాండ్ చేస్తాం అని ధ్వజమెత్తారు.
”పోలవరం ఎత్తు ఎప్పుడు పెంచారు? డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోంది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదు కదా? తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఎపికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. హైదరాబాద్ను ఎపిలో కలిపేయమని అడగగలమా?గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని అడిగితే బావుంటుందా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అలా అయితే చేసేయమనండి. ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి.. మాకు అభ్యంతరం లేదని అంటూ ఎద్దేవా చేశారు.
సాంకేతికంగా ఇబ్బందులస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి. ముంపు మండలాల గురించి మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి తప్ప.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని హితవు చెప్పారు.
“పువ్వాడ అజయ్ తన సంగతి చూసుకోవాలి. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాలు, ప్రజలు ఎపి రాష్ట్ర కుటుంబసభ్యులు. ఆ ప్రజల బాధ్యత పూర్తిగా మాది” అని బొత్సా స్పష్టం చేశారు.
కాగా, పోలవరం డ్యామ్ వల్ల భద్రాచలం మునిగిందనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి అవుతుందని, ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని ఆయన తెలిపారు.
1986లో పోలవరం లేదని, అప్పుడు భద్రాచలం మునగలేదా? అని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారోనని సందేహం వ్యక్తం చేశారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారని పేర్ని నాని ప్రశ్నించారు.
1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. యాదాద్రి నిర్మించినట్లే భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు.
పోలవరం ఇప్పట్లో పూర్తి కాదు
ఇలా ఉండగా, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. దశలవారీగా మాత్రమే పోలవరం పూర్తి చేయడం కుదురుతుందని స్పష్టం చేస్తారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని భావుసా ఇచ్చారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అంబటి రాంబాబు తెలిపారు. దీంతో పోలవరం ప్రాజెక్టును ఇదిగో కడుతున్నామని.. అదిగో అయిపోతుందని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అంబటి చెప్పిన నిజంతో తన వైఖరేంటో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది.