ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు రూ.1400కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కార్ కేంద్రానికి నివేదిక పంపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు కురిసాయి. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అని చాలామంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గోదావరి మట్టం రికార్డు స్థాయిలో ప్రవహించింది.
భద్రాచలం వద్ద దాదాపు 36 ఏళ్ల తర్వాత 70 అడుగుల మేర గోదావరి ప్రవహించింది. దీంతో పట్టణంలోని పలు కాలనీ లు నీటమునగా..ముంపు గ్రామాలు దాదాపు వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ప్రస్థుం శాంతించడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక కడెం ప్రాజెక్ట్ సైతం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే భయానకంగా వరద పోటెత్తింది. ఇక వందల ఇల్లు నీటమునిగాయి. ఎన్నో రోడ్లు తెగిపోవడం తో రాకపోకలు బంద్ అయ్యాయి. చాల చోట్ల కరెంట్ స్థంబాలు విరిగిపడడం తో పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ఇక వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. ఈ తరుణంలో రాష్ట్ర సర్కార్ వరద నష్టాల ఫై కేంద్రానికి నివేదిక ఇచ్చింది.
వరదల వల్ల కాజ్వేలు, రోడ్లు కొట్టుకపోవడం తదితర కారణాల వల్ల రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖలో రూ.449 కోట్లు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రూ.379కోట్లు. విద్యుత్శాఖలో రూ.7కోట్ల నష్టం జరిగినట్లు ఆయాశాఖలు ప్రాథమిక అంచనాల ద్వారా నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి అందించాయి. ఇక ఇండ్లు కూలిపోవడం, ముంపునకు గురికావడంతో పాటు వారిని తరలించే క్రమంలో రూ.25 కోట్లు, ఇంకా తదితర వరద నష్టాలు వెరసి మొత్తంగా రూ.1400 కోట్ల మేరకు రాష్ట్రంలో వరద నష్టం సంభవించిందని అధికారులు నివేదికలు సిద్ధం చేసి కేంద్రానికి నివేదిక పంపారు.
ఇలా ఉండగా, విపత్తు నిధులను అందించడంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కోసం గత 8 సంవత్సరాలలో దాదాపు రూ 3,000 కోట్లను, 2018 నుండి నేటి వరకు రూ 1,500 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని ఆయన వివరించారు.
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలో ఓ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై వివరణ ఇస్తూ ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది.
అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది.40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని తెలిపిన కేంద్రం డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది.
అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది.
ఇక తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న కేంద్ర మంత్రులు నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేకరించేందుకు త్వరలోనే ఎఫ్సీఐ రంగంలోకి దిగుతుందని వారు ప్రకటించారు.
ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సర్కారు రాజకీయం చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు.కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదని అంటూ తెలంగాణ ప్రభుత్వం తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రాని సమస్యలు తెలంగాణ లోనే ఎందుకోస్తోందని ఆయన ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.