తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ అర్హత ఇచ్చే అర్హత లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు లేవని ప్రకటించింది. జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే కేంద్ర జల కమీషన్ (సీడబ్ల్యుసి) అధ్యయనం తప్పనిసరి కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ సలహా కమిటీ ఆమోదం పొందాలని పేర్కొంది.
పెట్టుబడుల అనుమతి కేంద్రం నుంచి తీసుకోవాలని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్రం అంటోంది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్ ఈ విషయమై కేంద్ర వైఖరిని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక సమాధానిచ్చారు.
2016, 2018లో కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలని, హైపవర్ స్టీరింగ్ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు్ల్లో అవినీతిని కప్పిపుచ్చుకునేందుకునే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు చేసిన తప్పిదం వల్లే కాళేశ్వరానికి కేంద్రం జాతీయ హోదా నిరాకరించిందని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.