తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో మరెక్కడాలేని విధంగా చేపట్టిన ఈ కేంద్రం ప్రారంభం కోసం పోలీస్ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నగర సిపి సివి ఆనంద్ పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర తెలియజెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. నగరంలోని బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను రూ.585 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు నగర పోలీసు కమీషనర్ సివి ఆనంద్ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని సిపి కోరారు.
కాగా రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒకే వేదికగా పని చేయనున్నాయి. ఈనేపథ్యలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పాపులర్గా పోలీస్ టవర్స్ అని పిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 9.25 లక్షల కెమెరాలను ఈ సెంటర్లో మానిటర్ చేయనున్నారు.
దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసుశాఖకు వన్నెతెచ్చేలా రాష్ట్రప్రభుత్వం ఎన్నో ప్రత్యేకతలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐకానిక్ భవనంగా తీర్చిదిద్దింది. సాంకేతిక హంగులతో 19 అంతస్థులున్న ఈ భవనం నుంచి 360 డిగ్రీల కోణంలో భాగ్యనగరాన్ని వీక్షించవచ్చని పోలీసు అధికారులు వివరిస్తున్నార్చు.
ఈ భవనంలో సందర్శకులూ 14, 15 అంతస్థుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతించనున్నారు. ఈక్రమంలో 14,15 అంతస్థుల నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చని, అదేవిధంగా ఆరో అంతస్థులోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి వచ్చి బయట నుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ను వీక్షించేందుకూ సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.