ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జువ్వికుంట రత్న పుష్పరాజ్(66) అనారోగ్యంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. పుష్పరాజ్ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఏడుగురు సంతానం ఉన్న పెద్ద కుటుంబంలో పుష్పరాజ్ రెండోవారు.
ఆయన అన్నయ్య ఐఏఎస్ అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఒక తమ్ముడు డాక్టరుగా, మరొకరు ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయిని. పుష్పరాజ్ విద్యార్థి నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు.
1972లో జై ఆంధ్ర ఉద్యమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీతో కలసి ప్రజాజీవనంలోకి వచ్చిన ఆయన తొలుత స్వతంత్ర పార్టీ, తర్వాత లోక్ దళ్, జనతా పార్టీలలో పనిచేశారు. 1977- 78లో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
అలా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం 1983లో టీడీపీలో చేరడంతో మలుపు తిరిగింది. లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో ఆయన 1983లో టీడీపీలో చేరారు. ఎంతో నిబద్ధతతో పార్టీకి కట్టుబడి చివరివరకూ పనిచేశారు.
మూడు సార్లు ఎమ్యెల్యేగా, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రి వర్గాలలో పనిచేశారు. రెండు పర్యాయాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. టిడిపి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2017లో ఫుడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మాజీ మంత్రులు యడ్లపాటి వెంకట్రావు, దూళిపాళ్ల వీరయ్య చౌదరిలతో కలిసి 1994లో గుంటూరులో రైతు గర్జన నిర్వహించారు.