శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది.
అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ (ఎస్జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది.
అయితే, ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్ (ఎస్ఎఫ్ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. వీరవన్స మాట్లాడుతూ తమ ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు.
దేశాన్ని ఆరాచక పరిస్థితి నుంచి బయటపడేసి సరైన దారిలో నడిపించడం లేదా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రీక్త పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత అగాధం నుంచి దేశాన్ని పునరుత్థానం చేయడానికి అధ్యక్షుడు విక్రమసింఘే సరైన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల గత రాజకీయ విభేదాలు లేదా శత్రుత్వాలకు అతీతంగా వారి నిర్ణయాలకు మద్దతిస్తూ మార్గనిర్దేశం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
మరోవంక, రణీల్ విక్రమ సింఘే అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిరసనకారులు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల టెంట్లు తొలగించేందుకు రంగంలోకి దిగారు. ఈ మేరకు విక్రమ సింఘే ప్రభుత్వం అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు ఆమోదం తెలిపింది.
దీనిపై పార్లమెంట్లో ఓటింగ్ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. మరో నెల రోజుల పాటు శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని అమలు చేసింది.
మరోవంక, మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీలో లేరని, ఆయన సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉందని క్యాబినెట్ ప్రతినిధి బందుల గుణవర్దెన వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారన్న ఆగ్రహంతో ఈ నెల 9వ తేదీన ప్రజలు అధ్యక్షుని భవనాన్ని ముట్టడించిన దరిమిలా దేశాన్ని విడిచిపెట్టిన 73 ఏళ్ల రాజపక్స జులై 13న మాల్దీవులకు, మరుసటి రోజు అక్కడి నుంచి సింగపూర్కు పయనమయ్యారు.
రాజపక్సకు 14 రోజుల స్వల్పకాలిక వీసాను మంజూరు చేసిన సింగపూర్ ప్రభుత్వం తనకు ఆశ్రయం కల్పించాలని రాజపక్స కోరలేదని, అదే విధంగా ఆయనకు తమ ప్రభుత్వం ఎటువంటి ఆశ్రయం కల్పించలేదని ఇటీవల ప్రకటించడం గమనార్హం.