ఆంధ్ర ప్రదేశ్ లో లోన్ యాప్ నిర్వాహకు అకృత్యాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. నెల్లూరులో నేరుగా ఓ మాజీ మంత్రిని, ప్రస్తుత మంత్రిని ఫోనులు చేస్తూ, బెదిరిస్తూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమై నలుగురిని అరెస్టు చేశారు. మంత్రి కాకాని గోవర్థన్రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు బెదిరింపులు తప్పలేదు.
బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించాలంటూ రెండు రోజులుగా ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తమకేమీ సంబంధం లేదని మంత్రి గోవర్థన్రెడ్డి పిఎ సమాధానమిచ్చినా వారు ఫోన్ చేయడం మానలేదు. లోన్ చెల్లించాల్సిందేనంటూ మంత్రికి 79 సార్లు ఫోన్ చేశారు.
ఈ విషయంపై నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ”ముత్తుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా నా నంబర్కు 79సార్లు ఫోన్ చేశారు. నాకు ఎందుకు ఫోన్ చేశారనే విషయంపై ఆరా తీస్తే.. రుణం తీసుకున్న అశోక్కుమార్ నా నంబర్ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని చెప్పారు. అందుకే ఫోన్ చేస్తున్నామని చెబుతున్నారు” అని తెలిపారు.
వీరి ఆగడాలు శృతి మించడంతో జిల్లా ఎస్పి విజయారావుకు ఫిర్యాదు చేసిన్నట్లు చెప్పారు. పోలీసులు వివరాలు సేకరించి చెన్నైలోని నలుగురిని అరెస్టు చేశారు. లోన్యాప్ ముఠాను ట్రాప్ చేసేందుకు పోలీసుల విచారణలో భాగంగా మంత్రి పిఎ రూ.25వేలు చెల్లించారు.
ఆంధ్రాలో వారి ఆటలు సాగకపోవడంతో చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అంటూ బాధితులకు తాము అండగా ఉంటామని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే తన దృష్టికి, పోలీసుల దృష్టికి గానీ తీసుకురావాలని మంత్రి తెలిపారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.
‘మీ బావమరిది రూ.8 లక్షలు రుణం తీసుకున్నారు.. మీరే చెల్లించాలంటూ అనిల్కుమార్ యాదవ్కు ఫోన్ చేశారు. వారు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో మంత్రి, మాజీ మంత్రికి ఫోన్లు చేసి బెదిరించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి విజయరావు తెలిపారు.
వారి ల్యాప్టాప్, సెల్ఫోన్లు సీజ్ చేశామని చెప్పారు. చెన్నైకు చెందిన కోల్మ్యాన్స్ సర్వీసెస్ రికవరీ ఏజెన్సీ నుంచి ర్యాండమ్గా ఫోన్లు వస్తున్నాయని, అందులో భాగంగానే ప్రముఖుల నంబర్లకు ఫోన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. రుణం తీసుకున్న వారికి ఫోన్లు చేయకుండా.. ఇతర నంబర్లకు చేసి బెదిరించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.