శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించారు. పాత్రా చాల్ ల్యాండ్ స్కామ్ లో సంజయ్ రౌత్ కు ఇప్పటికే రెండుసార్లు అధికారులు సమన్లు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు.
ఏప్రిల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
ఈడీ దాడులపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ పగతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం లేదని..కావాలనే తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా శివసేనను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఎలా పోరాడాలో నేర్పించారని, తాను శివసేన కోసం పోరాడుతూనే ఉంటానని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు. సంజయ్ రౌత్కు ఈడీ జులై 20న సమన్లు పంపింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఆగస్టు 7 తర్వాత మాత్రమే హాజరుకావచ్చని తన లాయర్ల ద్వారా తెలియజేశారు.
ఈడీ అధికారులు మెరుపు దాడుల చేయడంతో శివసేన కార్యకర్తలు ముంబయిలోని సంజయ్ రౌత్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్షపూరితంగా తమ నాయకుడిని వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.