కేరళలో తొలి మంకీపాక్స్ మరణం నమోదయ్యింది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్లో 22 ఏళ్ల యువకుడు వైరస్తో చనిపోయాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఒక ప్రకటన చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ నుంచి జులై 22న భారత్ వచ్చాడు.
ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా అక్కడే మంకీ పాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి చెప్పారు. మంకీ పాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆమె వివరించారు. యువకుడి శరీరం నుండి తీసిన ద్రవాలను వైరాలజీ ల్యాబ్కు పంపామని, వాటి ఫలితాలు ఇంకా రావాల్సి వుందని చెప్పారు. ఈ కేసును ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తుందని వీణా జార్జి తెలిపారు.
మంకీపాక్స్తో మరణాలు అరుదని, అది కూడా యువకుడైనందున సవివర మైన దర్యాప్తు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రోజున యువకుడితో కలిసి విమానంలో ప్రయాణించిన వారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరినీ క్వారంటైన్లో ఉండాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
కాగా ఈ మరణానికి సంబంధించిన రిపోర్టును అలప్పూజలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు మొత్తం 4 మంకీ పాక్స్ కేసులు నమోదవ్వగా అందులో 3 కేరళలోనే నమోదవడం గమనార్హం.
బెంగళూరు విమానాశ్రయంలో ఒక ఇథోపియన్ వ్యక్తికి మంకీపాక్స్ అనుమానంతో పరీక్షలు నిర్వహించగా చికెన్ పాక్స్గా నిర్ధారణ అయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ వెల్లడించారు. ‘జులై నెల ప్రారంభంలో బెంగళూరు వచ్చిన ఇథోపియన్ వ్యక్తికి మంకీ పాక్స్ అనుమానిత లక్షణాలతో పరీక్షలు నిర్వహించగా, చికెన్ పాక్స్గా నివేదిక వచ్చింది’ అని మంత్రి ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది జులై 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 16,016 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ 75 దేశాల్లో కేవలం 5 మరణాలే నమోదయ్యాయి. ఆఫ్రికా వెలుపల స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో తొలి మరణాలు రికార్డ్ అయ్యాయి.