నేటి నుండి తెలుగు రాష్ట్రాలలో సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. టాలీవుడ్ లో కొన్ని రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం, ఓటీటీల్లో సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం, పెద్ద హీరోల రెమ్యునరేషన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు హద్దులు దాటడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ పరిస్థితులలో సినిమా బడ్జెట్ కూడా నియంత్రణ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నట్లు నిర్మాతలు పేర్కొంటున్నారు. ఇటువంటి పలు కారణాలతో చాలా రోజులుగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ పరిష్కారం అయ్యాకే సినిమా షూటింగ్ లు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు రేపు సోమవారం నుండి సినిమా షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాకుండా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే వరకు షూటింగ్లు జరగవని స్పష్టం చేస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉండగా, మరికొన్ని చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.
మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షునిగా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు హక్కు ఉండగా 42 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి. విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా ఫిలిం ఛాంబర్ తెలియజేసింది .