దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తలుపులు గట్టిగా పగలగొట్టి చూడగా విగతజీవిగా పడిఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.
అనారోగ్య సమస్యలతో తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమార్తె దీక్షిత తెలిపింది. ఆత్మహత్య సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నామని, లోపలి నుంచి గడియ పెట్టుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నట్టు వివరించింది.
భోజన సమయానికి బయటకు రాకపోవడంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత తెలిపారు. తలుపులను పగలగొట్టి చూడగా ఉరివేసుకొని ఉన్నట్లు తెలిపింది. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు బుధువారం నిర్వహించనున్నారు.
ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. అలాగే నందమూరి కల్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది.
నందమూరి తారకరామారావుకు మొత్తం 12 మంది సంతానం. వారిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కూతుళ్లు. వీళ్లలో ముగ్గురు కుమారులు చనిపోయారు. పెద్ద కుమారుడు రామకృష్ణ ఎన్టీయార్ బతికి ఉండగానే చనిపోగా.. మిగతా ఇద్దరు కుమారులు ఎన్టీయార్ స్వర్గస్థులైన తర్వాత చనిపోయారు.
ఇప్పుడు ఆయన చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో, ఎన్టీయార్ సంతానంలో ముగ్గురు కుమారులు, ఓ కూతురు మరణించారు. ఆయన 12 మంది సంతానంలో మొత్తం నలుగురు చనిపోయారు. దీంతో, ఇప్పుడు ఐదుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.