అల్ఖైదా చీఫ్ అల్ జవహరి కోసం రెండు దశాబ్దాలుగా వేట కొనసాగిస్తున్న అమెరికా బలగాలు, ఎట్టకేలకు గురిచూసి అతడు కాబూల్లో ఓ ఇంట్లో నక్కి ఉన్నాడని పసిగట్టి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మట్టుబెట్టాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రపంచంలోనే `మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్’గా ముద్రపడిన అతడిని తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లోనే, నేరుగా గురిచూసి డ్రోన్ తో మట్టుబెట్టడం గమనార్హం.
అయితే ఈ ఆపరేషన్కు సంబంధించి పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా నిఘా అధికారి ఒకరు కీలక విషయాలను వెల్లడించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్కు కొన్ని నెలల ముందు నుంచి సన్నాహాలు చేస్తుండటం గమనార్హం.
2001లో ట్విన్ టవర్లపై దాడి జరిగినప్పటి నుంచి అందుకు కారణమైన అల్ఖైదాను నామరూపాల్లేకుండా చేయాలని అమెరికా కంకణం కట్టుకుంది. దీని ముఖ్య సూత్రధారులు ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరి కోసం వేట మొదలు పెట్టింది. ఇద్దరూ అమెరికా నిఘా వర్గాలు కూడా పసిగట్టలేని రహస్య ప్రదేశాల్లో తలదాచుకున్నారు.
అయితే పదేళ్ల తర్వాత బిన్ లాడెన్ పాకిస్థాన్లో ఉన్నట్లు అగ్రరాజ్యానికి తెలిసింది. 2011 మే 2న సైన్యాన్ని రంగంలోకి దింపి రాత్రికి రాత్రే అతడ్ని మట్టుబెట్టింది. కానీ అల్ జవవరి ఆచూకీపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొంతకాలంగా అనారోగ్యంతో అతను మృతి చెందాడని కధనాలు కూడా వెలువడుతూ వస్తున్నాయి.
అయితే ఈ ఏడాది ఏప్రిల్లో అల్ జవహరి కుటుంబంతో సహా తన మకాం కాబూల్లోని ఓ ఇంట్లోకి మార్చినట్లు అమెరికా నిఘా వర్గాలకు కచ్చితమైన సమాచారం అందింది. వెంటనే నిఘా అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు జో బైడెన్తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు.
అనంతరం జులై1న బైడెన్తో అధికారులు మరోసారి సమావేశం నిర్వహించారు. జవహరిని ఎలా చంపబోతున్నామనే మాస్టర్ ప్లాన్కు బైడెన్కు వివరించారు. అల్ఖైదా చీఫ్ ప్రస్తుతం ఉన్న ఇంటి నమూనాను కూడా బైడెన్ చూపించి దాడి ఎలా చేసేది పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఆపరేషన్ గురించి బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో పాటు అతికొద్ది మంది అధికారులకు మాత్రమే తెలుసు.
ఆ తర్వాత జులై 25న తన కేబినెట్ సభ్యులు, ముఖ్య అధికారులో బైడెన్ సమావేశమయ్యారు. ఒకవేళ జవహరిని చంపితే తాలిబన్లతో అమెరికా సంబంధాలు ప్రభావితమవుతాయా? అనే విషయంపై చర్చించారు. అనంతరం జవహరిని హతమార్చేందుకు బైడెన్ అనుమతి ఇచ్చారు. పౌరుల ప్రాణాలకు ముప్పు లేకుండా వాయు దాడులు చేయాలని సూచించారు.
జులై 30న సీఐఏ పక్కా పథకంతో దాడికి సిద్ధమైంది. కాబూల్లో అల్ జవహరి ఉన్న ఇల్లును చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి రాగానే మానవరహిత డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు చేసింది. సరిగ్గా రాత్రి 9:38 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. జవహరి చనిపోయాడని నిర్ధరించుకున్నాకే సీఐఏ వెనుదిరిగింది.
అయితే దాడి జరిగిన సమయంలో జవవరి కుటుంబ సభ్యులు ఇంటి వేరే భాగం వైపు ఉన్నట్లు సీఐఏ అధికారి తెలిపారు. అల్ జవహరి తలదాచుకున్న ఇల్లు సీనియర్ తాలిబన్దే కావడం గమనార్హం. కాబూల్లోనే ఉన్నాడనే విషయం తాలిబన్లకు కూడా తెలుసని స్పష్టం అవుతున్నది. అయితే తాము చేపట్టిన ఆపరేషన్ గురించి తాలిబన్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమెరికా సేనలు జాగ్రత్త పడ్డాయి .
అల్ జవహరి హతమైనట్లు బైడెన్ సోమవారం అధికారిక ప్రకటన చేసినప్పుడు ఈ ఆపరేషన్ను ఎవరు నిర్వహించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా నిఘా వర్గాల నైపుణ్యాలను బైడెన్ కొనియాడారు.