బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట నుండి మంగళవారం మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటగా, ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. యాదగిరిగుట్టకు బయల్దేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, యాత్ర ప్రారంభించారు.
యాత్ర ప్రారంభ సూచికగా, స్థానిక వంగపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి నుంచి జనగామ జిల్లా మీదుగా వరంగల్కు చేరుకుంటుంది. వరంగల్లోని భద్రకాళిని దర్శించుకుని యాత్రను ముగిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు.
తొలిరోజు బండి సంజయ్ 10.5 కి.మీ. మేర పాదయాత్ర చేస్తారు. యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా గణేష్నగర్ నుంచి శుభం గార్డెన్కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, తిరిగి పాతగుట్ట, గొల్లగుడిసెలు మీదుగా దాతారుపల్లికి పాదయాత్రగా వెళ్తారు. దాతారుపల్లిలో జెండావిష్కరణ చేసి, అక్కడి నుంచి బస్వాపూర్ సమీపంలో రాత్రి బస చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
ఆగస్ట్ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోకి పాదయాత్ర మొదలు అవుతుంది. మొత్తం 24 రోజుల జరిగే ఈ యాత్రలో 328 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఐదు జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు నేతలు. ఈ నెల 26న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభతో మూడో విడత యాత్ర ముగుస్తుంది.